Sunday 8 October 2017

,🌺🌻🌼🌷🌸💮🍁మా బతుకమ్మ పండుగ కథలు ౼6🌺🌹🌷🌻🌼🍀🍁

🌺🌷🌻🌹🍁🌸🌼బతుకమ్మ  పండుగ -6 🌼🌹🌷🍁🌸🌺

 అక్కెమ్మ కన్నీటి గాధ , త్యాగనిరతి మనసుని ద్రవింప జేస్తుంది . మా అమ్మ ఈపాట చాలా బాగా , కరుణా రసం ఉట్టిపడేట్లుగా పాడేది . చాలా పెద్ద పాట . అలాగే ఒక 4,5 పాటలు అమ్మ మాత్రమె పాడేది . మిగిలినవారికి అంత బాగా వచ్చేవి కాదు . నా దురదృష్టం కొద్దీ అమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఆ జ్ఞానం లేకపోయింది . పాటలు రాసుకోలేదు , నేర్చుకోలేదు . అప్పుడు ఆ విలువ తెలియలేదు . తను ఉన్నన్ని రోజులు మా తమ్ముడి కూతురుతో , ఎంగిలి బతుకమ్మ , చద్దుల బతుకమ్మ పేర్చి ,ఆడించింది హైదరాబాద్లో . 10 సంవత్సరాలు అయింది అమ్మ పోయి .

ఇప్పుడు చెప్తున్న సుశీల కథ కూడా  అమ్మే చెప్పేది . అందరూ అమ్మ చుట్టూ కూర్చుని శ్రద్ధగా వినేవారు . 9 రోజుల్లో చద్దుల బతుకమ్మ ఆడే రోజు కథ చెప్పేది . మిగిలిన
రోజుల్లో పాట మాత్రమె !

🌹🌹🌹🌹సుశీల కథ 🌹🌹🌹🌹🌹
ఒకా నొక పుణ్యదంపతులకి ఏడుగురు కొడుకులు, ఒక్కతే కూతురు.
కొడుకుల తరవాత, ఆఖర్న పుట్టిన ఆడపిల్ల సుశీలను చాలా గారాబంగా పెంచుకున్నారు.
కొడుకులకు పెళ్ళిళ్ళు చేసి, కూతురుకు కూడా పెళ్ళి చేసి కాశీయాత్రకు భయలుదేరి వెళతారు..

ఆశ్వీజమాసంలో బతుకమ్మ పండుగ వచ్చింది. తల్లతండ్రులు దగ్గరలో లేరు కాబట్టి సుశీల, పెద్ద వదిన దగ్గరకు వెళ్ళి.. "పట్టుచీర, పట్టు రవికె, కాళ్ళకడియలు "
మొ. కావాలని అడుగుతుంది. ఆమె కోపంగా మొహం తిప్పుకుని "నా దగ్గర లేవు"
అంటుంది. అలాగే ఆరుగురు వదినలూ "మా దగ్గర లేవు " అంటారు. ఏడవ వదిన మాత్రం" నేను ఇస్తాను కానీ పట్టు రవికెకు గంధం అంటకూడదు, పట్టు చీర కు పసుపు అంటరాదు, భంగారు కడియాలు నొక్కులు పడరాదు ., అలా అయితేనే ఇస్తాను. ఒక వేళ అలా జరిగితే మాత్రం నీ నెత్తురు కళ్ళ జూస్తాను, గుర్తు పెట్టుకో.. ".. సుశీల వదిన గారి ఆంక్షలన్నీ సంతోషంగా ఒప్పుకొని, నగలు, చీరా, రవికా తీసుకొని వెళ్ళింది.

ఎనిమిదిరోజులూ బతుకమ్మ ఆడింది కానీ, కాళ్ళకు పసుపు రాసుకోలేదు.. మెడకు గంధం పూయనివ్వలేదు.. స్నేహితురాళ్ళతో 'బిస్తి ' గీయలేదు..వారు ఎంత అడిగినా ఒప్పుకోలేదు..వదినగారికి ఇచ్చిన మాట కోసం..
కానీ చద్దుల బతుకమ్మ నాడు స్నేహితులు పట్టుబట్టి సుశీల మెడకి గంధం, కాళ్ళకి పసుపు పూసి, బిస్తి గీయించి (ఆడపిల్లల.ఆట..రెండు చేతులూ బిగించి పట్టుకుని
పాదాలు నేలకానించి, చుట్టూ తిరగడాన్ని బిస్తి గీయడం అంటారు) , ఆట లాడించి గానీ వదల్లేదు.

కానీ సుశీల రవికెకు గంధం, చీరకు పసుపు , బంగారు కడియాలకు నొక్కులూ పడ్డాయి.సుశీల భయపడి వదినగారు పనిలో వున్నప్పుడు అవి తిరిగి ఇచ్చేసింది. తరువాత చూసుకున్న వదినకి చాలా కోపం వచ్చి పట్టు చీర రవికా
చింపి తలకు, వాసెన గట్టి పడుకుంటుంది. కాసేపటికి భర్త వచ్చి "ఏమైంది " అని అడుగుతాడు...ఆమె తలనొప్పి అని చెప్తుంది.. "ఏం రాస్తే తగ్గుతుంది? " అని అడుగుతాడు.. "నెత్తురు రాస్తే తగ్గుతుంది. " "ఏ నెత్తురు కావాలి ? "
అంటాడు.. "నీ చెల్లి రక్తం తెస్తే తగ్గుతుందీ " అంటుంది.
ఒక్కగానొక్క గారాల చెల్లి సుశీల..ఆమె రక్తం ఎలా తీస్తాడు..
??
మర్నాడు అడవికి పోయి, కాకి ని చంపి ఆ నెత్తురు తెచ్చి ఇస్తాడు.
సంతోషంగా లేచి, భర్తకి వంట చేసి పెట్టి, ఆనెత్తరు నుదుటికి పట్టించి ,
కడవ తీసుకుని నీళ్ళకు వెళ్ళింది.
"కట్లా కట్లా కడవ.తీసుకొని
మెట్లా భావికి నీళ్ళకి పోతే..
కలవారి కోడలు కాకి నెత్తురు పెట్టుకుందీ "....
అని అందరూ నవ్వుతారు.
మళ్ళీ తలకి వాసెన గట్టి పడుకుంటుంది.
భర్త మళ్ళీ అడుగుతాడు.. ఆమె నీ చెల్లి రక్తం కావాలి అంటుంది.
మర్నాడు పిట్ట రక్తం తెచ్చి, అది మా చెల్లిదే అంటాడు.
ఆమె ఆ రక్తాన్ని నుదుటికి పట్టించి కడవతో నీళ్ళకు వెళుతుంది.
మళ్ళీ అందరూ..
"కట్లా కట్లా కడవ.తీసుకొని
మెట్లా భావికి నీళ్ళకి పోతే..
కలవారి కోడలు పిట్ట నెత్తురు పెట్టుకొచ్చిందీ "....
అని నవ్వుతారు.
మళ్ళీ కోపంతో ఇంటికి వచ్చి , భర్త ముందు ఉరి పోసుకుంటానని బెదిరిస్తంది.
అప్పుడు భర్త, ఈ సారి చెల్లిని చంపి, ఆమె రక్తమే తెస్తానని మాట ఇచ్చి ..
సూది, దబ్బనం, కత్తి, నువ్వులు, పెరుగన్నం మూట గట్టుకోని,
చెల్లి దగ్గరకు వచ్చి "మీ అత్తింటి వారు తీసుకొని రమ్మన్నారు " అని చెప్పి బయలుదేరదీస్తాడు. సుశీల నిజంగా భర్త దగ్గరకే వెళుతున్ననని సంతోషంగా బయలుదేరుతుంది. అడవికి చేరుకోగానే పెరుగన్నం తినమంటాడు.
తింటుంది. అలసిన సుశీల నిద్రకు పక్రమించగానే, వడిలో పడుకో బెట్టుకొని నువ్వులు తలలో పోసి కుక్కడం మొదలు పెడతాడు.. పేలు కుక్కినట్లు..అలా చేస్తే గాఢమైన నిద్ర పడుతుందట..
సుశీల నిద్ర పోగానే సూది తో గుచ్చుతాడు... రక్తం రాదు..
దబ్బనం తో గుచ్చతాడు.. రక్తం రాదు కానీ సుశీల నిద్ర లేచి.
"అన్నా, .నన్ను.చంపడానికి ఇంత కష్టం ఎందుకూ...
కత్తితో ఒకేసారి చంపరాదా..నా నెత్తరు తీసుకెళ్ళి వదినకి ఇవ్వు. "
అప్పుడు కత్తితో పొడిచి రక్తం తీసుకుని వెళ్ళిపోతాడు.
మరణించిన
సుశీల పొట్ట చేద బావిగా,
కాళ్ళూ చేతులు చేద బొక్కెన, తాడూ,
కళ్ళు రామచిలుకలూ..
జుట్టు రంగు రంగుల పూల మొక్కలు గా మారి అందమైన తోట వెలుస్తుంది.
కాశీయాత్రకు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ , ఈ తోట చూసి వెళ్ళేటప్పుడు
లేని తోట 6నెలల్లో ఎలా వచ్చిందా అని అబ్బుర పడతారు.
భావిలో నీరు త్రాగి సేద తీరుదామని, చేద బొక్కెన భావిలో వేస్తాడు తండ్రి.
విచిత్రంగా బావిలోంచి మాటలు వినపడతాయి ..
" ముట్టకు ముట్టకు ఓ నాన్నా, ముడితే నీ చేయి కందేనూ
అంటకు అంటకు ఓనాన్నా .....అంటితే నీ చేయి కందేనూ " అంటూ..
అతను చేద వదిలేసి..తల్లికి ఇస్తాడు.
తల్లి నీళ్ళు తోడ బోయినా అలాగే వస్తాయి మాటలు.
బయటివారు ఎవరు ముట్టుకున్నా ఏమీ వినపడటంలేదు.
తమ ఏడుగురు కొడుకులనూ, కోడళ్ళనూ పిలుస్తారు.
ఆరుగురు కొడుకులూ, కోడళ్ళూ ముట్టుకున్నా.
"ముట్టకు ముట్టకు ఓ అన్నా.. / వదినా .."
అంటూ మాటలు వచ్చాయుి
ఏడో అన్న తాకినప్పుడు " పాపకారి వదిన చెప్పిందని..
దోషకారి అన్నయ్యవు నీవే కదా నన్ను చంపిందీ.. "
అని మాటలు వినపడతాయి. సుశీల తల్లిదండ్రులు
జరిగినవన్నీ తెలుసుకొని, సుశీల భర్తను పిలిపించి ఆమెకు
ఉత్తర క్రియలు జరిపిస్తారు. సుశీల భర్త శివ భక్తుడు.
తనను కూడా భగవదైక్యం చేసుకొమ్మని శివునికై తపస్సు చేస్తాడు.
శివ పార్వతులు ప్రత్యక్షమై, నిష్కారణంగా మరణించిన సుశీల తిరిగి బ్రతికి వస్తుందని, అందుకు తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి, గౌరీ దేవిని ఆట పాటలతో,
నైవేద్యాలతో ప్రీతి చెందేటట్లు చేయమని చెప్తారు.
అలా తొమ్మిది రోజులు బతుకమ్మను పూజించి, పసుపు గౌరమ్మను ఓల లాడించగానే, సుశీల పన్నెండేళ్ళ బాలగా నడచి వస్తుంది.
ఆనందంగా ఆమెను అక్కున చేర్చుకుని...ఆనందంగా గడుపుతారు .
అప్పటినుండీ ఆడ పిల్లలు తమ ఆయుష్షుకోసం..సౌభాగ్యం కోసం
గౌరీ దేవి శుభాసీస్సుల కోసం
బతుకమ్మను పూలతో పేర్చి , పసుపు కుంకుమలతో కొలిచి , నీళ్ళల్లో వదిలి తమ భక్తినీ , ప్రేమనీ , గౌరవాన్నీ పాటల ద్వారా తెలుపుకుంటారు . అందుకే ఎంతో ఉదాత్తమైన , ఉన్నత మైన విలువలు కలిగిన పండుగ ఇది .


No comments:

Post a Comment